సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులేందరో యిక్కడ నడయడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగామిగా నిలిచింది. సాహిత్య ప్రక్రియలో మరీ ముఖ్యంగా కధాప్రక్రియలో గుంటూరుసీమది ప్రత్యేకించి చెప్పుకోదగిన విలక్షణ స్థానం. తొలి కధాకాంతులను అందుకోవటంతో పాటు కధావిమర్శ, అనువాద కధలను తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది గుంటూరుసీమ వాసి అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు. ఇంతమంది కధకులు ఒక్క జిల్లాలోనే ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు నాలుగువందల మంది కధకులు, అందునా తెలుగు కధను విద్యుత్తేజంతో వికసింపజేసిన పలువురు ప్రసిద్ధులు ఈ సీమవారే కావటం ప్రపంచం సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్ట విషయం.
కధానిక చరిత్రను ఉద్యమస్థాయిలో నిర్మించిన గుంటూరు కధకు ఇప్పుడు వందేళ్ళు. కధనే కాదు సకల సాహిత్యప్రక్రియలనూ ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసిన అభ్యుదయ రచయితల సంఘం సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆవిర్భవించిందీ గుంటూరుసీమలోనే. ఈ సందర్భంగా అరసం - గుంటూరు జిల్లా శాఖ మూడు తరాల కధారచయితల 70 కధల సంకలనాన్ని పాఠకలోకానికి ప్రేమతో సమర్పిస్తోంది.