‘నేను భయంతో పారిపోవడంలేదు. దేవీ దేవతలవంటి అత్తమామలూ, అపరదైవమే అయిన నీవూ కొలువుతీరిఉన్న ఈ పూజామందిరంలో నావంటి గడ్డిపూవు శోభనీయజాలదని ఆలస్యంగా తెలుసుకున్నాను.’ మౌళి దుఃఖం కట్టలు త్రెంచుకున్నది. ఆమె అందాలరాశి. చందనపు బొమ్మ, బంగారంవంటి ఉదాత్తమైన మనసుంది. పవిత్రమైన ఆలోచనలున్నాయి. తనదంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోవాలనీ, ఒక్కరి ఆరాధనలోనే జీవితాన్ని ఆనందంగా గడపాలనీ, ఒక్కరికే తన జీవిత కుసుమాన్ని అంకితం చేయాలనీ, ధన్యత చెందాలనీ ఆమె ఆకాంక్ష… తపన… కాని, ఆమె ఊహ తెలిసేసరికే ఊబిలో కూరుకుపోయి వున్నది. ధనానికే తప్ప హృదయానికీ, వ్యక్తిత్వానికీ, పవిత్రతకూ ఏమీ విలువ ఇవ్వని రాక్షసిలాటి తల్లి… ఆమె శరీరాన్నే మూలధనంగా పెట్టి అపార ధనరాసులు గడించాలనే నీచపు ఆలోచనల పుట్ట ఆ తల్లి… ఆమెచుట్టూ ఆమెకు తగినవారే అందరూ. ఆమె ఈ ఘోర విపర్యయాలకు ఎలా తట్టుకున్నది? ఆమె మనసిచ్చిన మౌళి ఎన్ని యాతనలు పడ్డాడు? వూబివంటి నికృష్టజీవితంనుంచి ఆమె ఎలా ఉద్ధరింపబడింది? ఊపిరి సలపనీయక ఉత్కంఠతో అందాల చలనచిత్రంలా కొనసాగిన రమ్యరచన – ‘జనరంజని’