ప్రేమ్ చంద్ తన కథల్లోని పాత్రల ద్వారా యావత్సమాజాన్ని, నాటి చరిత్రను సజీవంగా సృష్టించాడు. తన అంతరాంతరాల్లో జీర్ణించుకున్న విషయాలనే రాయడం చేత ఆయన సృష్టించిన పాత్రలు తిన్నగా మన ఎదుట నిలబడతాయి. వాటిని గుర్తించడానికి ఏమీ సమయం పట్టదు. సామాజిక సంఘటనలు, పరిస్థితులు ఆయన అనుభవించిన జీవిత వాస్తవికత ఆయన మనస్సులో ఆవృత్తమై ఆయన కలం ద్వారా మనకు సాక్షాత్కరిస్తాయి.పల్లెపట్టుల జీవిత విధానం అంతా ప్రేమ్ చంద్ కథల్లో కనిపిస్తుంది. ఆయన కథలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రేమ్ చంద్ ఉపాధ్యాయ వృత్తి జీవనోపాధిగా అవలంబించాడు. అందుచేత ఆదర్శవాదం, శీలనిర్మాణం వైపు మొగ్గుచూపడం స్వాభావికం. ఆయన పైన మహాత్మా గాంధీ, టాల్ స్టాయ్ ల ప్రభావం బాగా ఉంది.